![]()
భద్రగిరి మార్ట్, గిరిజన మ్యూజియం ఆదివాసుల అభ్యున్నతికి ఆదర్శం
- ఐటీడీఏ పీవో బి. రాహుల్ ప్రత్యేక చొరవ అభినందనీయం
- టీజీఐఆర్డీ సెంటర్ హెడ్ సుభాష్ చంద్ర గౌడ్
భద్రాచలం, జూన్ 11 (మన భద్రాద్రి న్యూస్)
ఆదివాసీ గిరిజన మహిళలు, రైతులకు ఆర్థికంగా చేయూతనందించేందుకు భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్, గిరిజన మ్యూజియం, కోయ ఇలవేల్పుల చరిత్ర ప్రదర్శన ప్రశంసనీయమని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ (టీజీఐఆర్డీ) సెంటర్ హెడ్ సుభాష్ చంద్ర గౌడ్ అన్నారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్లో టీజీఐఆర్డీ ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో పీసా చట్టం అమలుపై నిర్వహించిన రాష్ట్రస్థాయి వర్క్షాప్లో భద్రాచలం ఐటీడీఏ చేపట్టిన కార్యక్రమాలను సహాయ ప్రాజెక్టు అధికారి (జనరల్) డేవిడ్ రాజ్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం భద్రగిరి మార్ట్లోని ఉత్పత్తులను టీజీఐఆర్డీ సెంటర్ హెడ్కు అందజేశారు.
ఈ సందర్భంగా సుభాష్ చంద్ర గౌడ్ మాట్లాడుతూ, అంతరించిపోతున్న ఆదివాసీ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను నేటి తరానికి పరిచయం చేసేలా గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గిరిజనుల గోత్రనామాలు, ఇలవేల్పుల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే ప్రయత్నం ఎంతో విలువైనదని పేర్కొన్నారు.
భద్రగిరి మార్ట్ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు, ఆదివాసీ మహిళలు, రైతులు తయారు చేస్తున్న మిల్లెట్ ఉత్పత్తులు, ఇప్పపువ్వు లడ్డూలు, పచ్చళ్లు, తృణధాన్యాలు, వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడం ద్వారా మధ్యవర్తుల దోపిడీ నుంచి వారిని కాపాడుతూ ఆర్థికంగా బలోపేతం చేస్తున్న ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ సేవలను ప్రత్యేకంగా అభినందించారు.
భద్రాచలం ఐటీడీఏ అమలు చేస్తున్న ఈ నమూనాను రాష్ట్రంలోని ఇతర గిరిజన ప్రాంతాల్లో కూడా అమలు చేస్తే ఆదివాసీ కుటుంబాలు ఆర్థికంగా మరింత బలోపేతం అవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో పీసా అధికారి అశోక్, వివిధ శాఖల అధికారులు, గిరిజన గ్రామాల సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.








