![]()
బూర్గంపాడు: బూర్గంపాడు మండలం ఉప్పుసాక గ్రామ పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) పనులు వ్యవసాయ కార్మికులకు దక్కకుండా చేసే కుట్రలో భాగంగా కొత్త నిబంధనలు అమలు చేస్తోందని ఆరోపించారు. కార్మికుల హాజరు నమోదు కోసం మొబైల్ యాప్లో రెండు ఫోటోలు, ముఖ గుర్తింపు (ఫేస్ ఆథెంటికేషన్) విధానాన్ని తప్పనిసరి చేయడం వల్ల వృద్ధులు, కంటి చూపు సరిగా లేని వారు, ముఖంపై ముడతలు ఉన్న కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సాంకేతిక కారణాలతో హాజరు నమోదు కాకపోవడంతో కార్మికులను పనికి అనుమతించకుండా తిరిగి ఇళ్లకు పంపిస్తున్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకానికి రూ.2.50 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.96 వేల కోట్లనే కేటాయించిందని విమర్శించారు. దీంతో గ్రామీణ కార్మికులకు తగినంత ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని అన్నారు.
ఉపాధి కార్మికులకు రోజుకు కనీసం రూ.600 వేతనం చెల్లించాలని, పని ప్రదేశాల్లో టెంట్లు, తాగునీరు, ప్రథమ చికిత్స (మెడికల్ కిట్), రవాణా సౌకర్యం వంటి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కార్మికులకు రూ.200 నుంచి రూ.250 వరకు మాత్రమే వేతనం అందుతోందని, ప్రభుత్వం ప్రకటించిన రూ.350 వేతనం కూడా పూర్తిగా చెల్లించడం లేదని ఆరోపించారు. ఎండ తీవ్రతలో కష్టపడి పనిచేస్తున్న కార్మికులకు తగిన వేతనం, సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులపై ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కుర్స తిరుపతయ్య, బోల్లి శ్రీను, రవి, కుమారి తదితరులు పాల్గొన్నారు.








